పీడీఎస్ బియాన్ని బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడుతున్న నిందితుడిపై పీడీ యాక్ట్ : పోలీస్ కమిషనర్
ఖమ్మం ప్రతినిధి : ఆగస్టు, 24 :పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి అంతర్రాష్ట్రాలకు తరలించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ ఆర్థిక లాభాలు ఆర్జిస్తున్న మీర్జా జిలానీ బేగ్ (48) సం,,పై పీడీ యాక్ట్ను అమలు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన మీర్జా జిలానీ బేగ్ (48) సం,, రేషన్ డీలర్లు, వారి ఏజెంట్ల ద్వారా కార్డుదారులకు అందాల్సిన సబ్సిడీ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడిపై తల్లాడ పోలీస్ స్టేషన్లలో పీడీఎస్ బియ్యం అక్రమ కొనుగోలుసంబంధించి మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ కేసుల్లో భారతీయ న్యాయ సంహిత (BNS), ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ (ECA), తెలంగాణ పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్స్కు సంబంధించిన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి కార్యకలాపాల ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ఉద్దేశించిన ఆహార భద్రత వ్యవస్థకు తీవ్ర విఘాతం కలుగుతోందని, సమాజానికి అవసరమైన నిత్యావసర వస్తువుల సరఫరా వ్యవస్థను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిపై గతంలో పలుమార్లు కేసులు నమోదు కావడంతో పాటు, BNSS సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేసినప్పటికీ తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని, ఈ నేపథ్యంలో పీడీ యాక్ట్ అమలు చేసి వైరా సిఐ వెంకట ప్రసాద్, తల్లాడ ఎస్సై వెంకట కృష్ణ నిందితుడిని అదుపులోకి తీసుకోని హైదరాబాద్లోని చంచల్గూడ సెంట్రల్ జైలు తరలించడం జరిగింది.ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, బ్లాక్ మార్కెట్కు తరలించడం వంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.