🏠 www.aryadvi.com
Watermark
Newspaper Logo
www.aryadvi.com | Date: 25 Aug, 2026 | Page: 1

తెలంగాణలో జోరుగా వర్షాలు.. జలకళ సంతరించుకుంటున్న ప్రాజెక్టులు

🌧️ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
💧 పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు
📍 మెదక్ పెద్దశంకరంపేటలో అత్యధికంగా 11 సెం.మీ వర్షపాతం
🌊 తాలిపేరు ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తివేత
🚰 మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు ఎత్తి నీటి విడుదల
⛏️ వరద నీటితో సింగరేణి గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
🌾 వర్షాలతో పంటలకు జీవం.. రైతుల్లో ఆనందం
⚠️ ఆగస్టు 28 వరకు వర్షాలు కొనసాగే అవకాశం
🟡 26 జిల్లాలకు ఎల్లో అలర్ట్

అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎండిపోతున్న పంటలకు ఈ వర్షాలు జీవం పోయడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. అయితే భారీ వర్షాల కారణంగా సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

గడిచిన 24 గంటల్లో మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది.

వర్షాలతో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులకు చేరువైంది. ప్రస్తుతం నీటిమట్టం 1,401 అడుగులకు చేరింది. శ్రీరామ్ సాగర్ జలాశయంలో నీటిమట్టం 44 టీఎంసీలు దాటింది.

కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో 17 గేట్లు ఎత్తి 74 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి కూడా వరద పోటెత్తడంతో 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

మరోవైపు ఇల్లందు, మణుగూరులోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు, ఆగస్టు 28 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు 26 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
🏠 Home